43 డిగ్రీల‌కు పైగా న‌మోదవుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. వైద్యారోగ్య శాఖ కీల‌క ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి

  • Publish Date - April 19, 2024 / 08:46 PM IST

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉద‌యం 8 గంట‌ల‌కే సూర్యుడు భ‌గ‌భ‌గ మండుతుండ‌టంతో గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నాలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కూడా వేడి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ ఆదేశాల మేర‌కు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌ను వివ‌రిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

చేయాల్సిన ప‌నులు..

1. శ‌రీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. దాహం వేయ‌న‌ప్ప‌టికీ త‌రుచుగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ క‌లిపిన వాట‌ర్ తీసుకుంటే ఇంకా మంచిది. నిమ్మ‌కాయ ర‌సం, మ‌జ్జిగ వంటి ద్రావ‌ణాల‌ను తీసుకోవాలి. పండ్ల ర‌సాలు కూడా మంచిదే.
2. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తే.. నీటిని వెంట తీసుకెళ్లాలి.
3. నీటి ప‌రిమాణం అధికంగా ఉండే పుచ్చ‌కాయ‌(వాట‌ర్ మెల‌న్), క‌ర్భూజ‌(మ‌స్క్ మెల‌న్‌), ఆరెంజ్, ద్రాక్ష‌, పైనాపిల్, దోస‌కాయ వంటి ప‌దార్థాల‌ను తీసుకోవాలి.
4. లేత రంగులో ఉండే కాట‌న్ దుస్తులు ధ‌రించాలి.
5. ఎండ‌కు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు గొడుగు, టోపీ, ట‌వ‌ల్ వంటి వాటిని త‌ల‌కు క‌ప్పుకోవాలి. సూర్య‌కిర‌ణాలు త‌ల‌పై ప‌డ‌కుండా చూసుకుంటే వ‌డ‌దెబ్బకు దూరంగా ఉండొచ్చు.
6. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో కాళ్ల‌కు చెప్పులు క‌చ్చితంగా ధ‌రించాలి.
7. సాధ్య‌మైనంత వ‌ర‌కు చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో ఉండాలి.
8. ఇంట్లోకి వ‌డ‌గాలులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
9. ఒక వేళ బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో వెళ్ల‌డం మంచిది.
10. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు టీవీ చూస్తుండాలి. అలాగే న్యూస్ పేప‌ర్స్ కూడా చ‌ద‌వాలి. వెద‌ర్ అప్‌డేట్ కోసం mausam.imd.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

చేయ‌కూడ‌ని ప‌నులు..

1. మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు.
2. బ‌లాన్ని ఉప‌యోగించి చేసే ప‌నుల‌కు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో దూరంగా ఉండాలి.
3. చెప్పుల్లేకుండా అస‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు.
4. మిట్ట మ‌ధ్యాహ్నంలో వంట‌లు చేయ‌కూడ‌దు. ఒక వేళ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో వంట చేయాల్సి వ‌స్తే కిటికీలు, త‌లుపులు తెరిచి ఉంచాలి. స్టౌవ్‌కు గాలి త‌గిలేలా ఉండాలి.
5. మ‌ద్యం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
6. ప్రోటిన్ అధిక ప‌రిమాణంలో ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. చ‌ద్ది ఆహారాన్ని కూడా తీసుకోకూడ‌దు.
7. పార్కింగ్ చేసిన వాహ‌నాల్లో పిల్ల‌ల‌ను, పెంపుడు జంతువుల‌ను ఉంచ‌కూడ‌దు.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సిందే..

1. ఒత్తిడికి గురైన‌ప్పుడు
2. చ‌ర్మం ఎర్ర‌గా మారినా, దుర‌ద వ‌చ్చినా
3. బాడీ టెంప‌రేచ‌ర్ 104 డిగ్రీల ఫారెన్ హీట్స్ దాటినా
4. త‌ల‌నొప్పిగా ఉన్నా..
5. ఆందోళ‌న‌కు, మూర్ఛ‌కు గురైనా..
6. శ‌రీరంలో తిమ్మిర్లు వ‌చ్చినా
7. వికారంగా ఉన్న‌ప్పుడు, వాంతులు వ‌చ్చిన‌ప్పుడు
8. హార్ట్ బీట్‌లో తేడా ఉన్నా, శ్వాస స‌మ‌స్య‌లు త‌లెత్తినా..

వీళ్లు అస‌లు బ‌య‌ట‌కు వెళ్లొద్దు..

ఎండ‌లు గ‌ట్టిగా కొడుతున్న నేప‌థ్యంలో పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు. చిన్న పిల్ల‌లు, గ‌ర్భిణులు, అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, మాన‌సిక వైక‌ల్యం ఉన్న‌వారు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డమే మంచిది. మ‌రి ముఖ్యంగా గుండె స‌మస్య‌తో బాధ‌ప‌డే వారు, బీపీ పేషెంట్లు అస‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు.

అప్ర‌మ‌త్తంగా ఉన్నాం : ప్ర‌జారోగ్య సంచాల‌కులు

ఎండ‌ల వేడిమిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌లెవ‌రూ ఇబ్బంది ప‌డొద్ద‌నే ఉద్దేశంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమ‌త్తంగా ఉండి, అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ బీ ర‌వీంద‌ర్ నాయ‌క్ తెలిపారు. అన్ని ప్ర‌జారోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, అత్య‌వ‌స‌ర మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామ‌న్నారు. ఏఎన్ఎం, ఆశా, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటార‌ని పేర్కొన్నారు.

Latest News