పథకాల్లో కోత పెట్టడమే సీఎం పనినా, ఆయన కటింగ్ మాస్టరా … బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సీఎం అంటే కటింగ్‌ మాస్టరా? అంటూ రేవంత్‌రెడ్డిని బీఆరెస్‌ అధినేత కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా..? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? అంటూ ట్విటర్ వేదికగా నిలదీశారు

  • Publish Date - June 23, 2024 / 07:29 PM IST

విధాత, హైదరాబాద్ : సీఎం అంటే కటింగ్‌ మాస్టరా? అంటూ రేవంత్‌రెడ్డిని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా..? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? అంటూ ట్విటర్ వేదికగా నిలదీశారు. నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారని.. నేడు రూ.2లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. రూ.39వేలకోట్లు.. ఇప్పుడు రూ.31వేలకోట్లకు కటింగ్‌ పెట్టి కుదించారన్నారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమన్నారు. రేషన్ కార్డు సాకు చూపి.. లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ‘అందరికీ అన్నీ’ అన్నారని.. అధికారంలోకి రాగానే ‘కొందరికే కొన్ని’ అంటూ కోతపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. పథకాలలో శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారని.. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రూ.2లక్షల రుణమాఫీని కూడా ఎగొట్టేందుకు లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని.. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని ఆరోపించారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా.. లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం.. పోరాటం చేస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు.

Latest News