Site icon vidhaatha

KTR | కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డు కాలం.. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డు కాలం
కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
సాగు విస్తీర్ణం కోతతో పెట్టుబడి సాయం ఏగవేతకు కాంగ్రెస్‌ యత్నం
కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదని విమర్శలు
సుంకిశాల కాంట్రాక్టు ఏజెన్సీపై మెతక వైఖరిపై రాహుల్‌గాంధీకి ప్రశ్న

విధాత, హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగమని, కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం ఏర్పడిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్..తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే ఢమాల్ అని, ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని కేటీఆర్ విమర్శించారు. దశాబ్ధ కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసమైందని, సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం ఏర్పడిందని ప్రశ్నించారు.

మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్..నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అని మభ్య పెట్టి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని ఆరోపించారు. రూ.500 బోనస్ అని నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ అని, ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయని, చేతలు సచివాలయం గేటు దాటడం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితని, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదని, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని, చెరువులకు మళ్లించే తెలివి లేదని, ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు.

బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదన్నారు. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు, క్యూలైన్లలో పాసుబుక్కులు, చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారని, కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు పడుతున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు ఇలా ఒకటా.. రెండా సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష ఉన్నాయని కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.

సుంకిశాల కాంట్రాక్టు ఏజెన్సీపై చర్యలేవని రాహల్‌గాంధీకి ప్రశ్న

సుంకిశాల రిటైనింగ్ వాల్ నిర్మాణం కూలిపోయిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌ సుంకిశాల దుర్ఘటన జరిగి 10 రోజులకు పైగా అయ్యిందని, ఏజెన్సీ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అంతేగాక రాహుల్ గాంధీ గారూ.. మీ ప్రభుత్వం ఏజన్సీ పట్ల ఎందుకు మెతకగా వ్యవహరిస్తోందని అంటూ.. దీనికి మీ దగ్గర ఏదైనా సమాధానాలు ఉన్నాయా? అని కేటీఆర్ నిలదీశారు.

Exit mobile version