బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
రైతులపై దాడులు జరుగుతుంటే సీఎం ఢిల్లీ పర్యటన సిగ్గుచేటు
కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో ఐదునెలల్లోనే సంక్షోభంలోకి వ్యవసాయం
విధాత: ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అని, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి అని ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కోన్నారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు., రాష్ట్రంలో రైతన్నల పైన దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని సీఎంకు హితవు పలికారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమేనని మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతన్నల సమస్యల పైన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి విత్తన కొరత, పంపిణీ సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన లాఠీ చార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు చేస్తే బీఆరెస్ పార్టీ ఊరుకోదని, రాష్ట్ర రైతన్నలకు అండగా ఉంటామని, అవసరమైతే పార్టీ తరఫున విస్తృతమైన నిరసనగా కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ ప్రభుత్వానికి హెచ్చరించారు. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.
రైతులపై లాఠీచార్జ్ మార్పునా..
మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పునా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇలా తమకు కావాల్సిన అన్నింటిని సాఫీగా అందుకున్నదని, కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారైయ్యిందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని కేటీఆర్ విమర్శించారు.