Site icon vidhaatha

తెలంగాణలో ఇంటి వద్దకే మెడికల్‌ కిట్లు

తెలంగాణలో మరో 10వేల పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కరోనా బాధితులకు 60వేల పడకలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరోనాపై సీఎస్‌, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిమ్స్‌లో 500; సరోజినీ దేవి, టిమ్స్‌లో 200 చొప్పున; గొల్కొండ, మలక్‌పేట ఆస్పత్రుల్లో 100 చొప్పున; అమీర్‌పేట, ఛాతీ ఆస్పత్రుల్లో 50 చొప్పున అదనపు పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ బాధితుల కోసం మరో 5 లక్షల మెడికల్‌ కిట్లను ఇంటి వద్దకే పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొవిడ్‌ బాధితులకు అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్ హెల్ప్‌లైన్‌ కాల్‌సెంటర్‌ నంబర్‌ 040-2111-1111ను సంప్రదించాలని సూచించారు.

ఔషధాల పర్యవేక్షణకు సందీప్‌కుమార్‌ సుల్లానియా నేతృత్వంలో, ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ పర్యవేక్షణకు రఘునందన్‌రావు నేతృత్వంలో, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాల కోసం జయేశ్‌రంజన్‌ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎస్‌ చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం ప్రత్యేక అధికారులుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించనున్నట్లు సీఎస్‌ వెల్లడించారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని కొవిడ్ టీకాలు ఇవ్వాలని, ఆక్సిజన్‌ కేటాయింపులు 600 మొట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎస్‌ మరో లేఖ రాశారు.

Exit mobile version