Site icon vidhaatha

Minister Seethakka | ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రాధాన్యత: మంత్రి సీతక్క

విద్యార్థుల ఎదుగుదల టీచర్లతోనే సాధ్యం
నన్ను చూసి మా టీచర్లు సంతోషపడుతారు

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం విద్య బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తు కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందన్నారు. అటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కోవడం తక్కువగా భావించే పద్ధతి పోవాలని, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రతిభ గల పిడుగులున్నారన్నారు. ప్రభుత్వ విద్య పటిష్టతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశామని, డీఎస్సీ పరీక్ష నిర్వహించామని, టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలుంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు.

సమస్యలుంటే పోరాడి సాధించుకోవాలని, టీచర్లు సైతం నిత్య విద్యార్థుల వలె అధ్యయనం చేయాలని, టీచర్లు వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. తమ పిల్లలకు దీటుగా సర్కారీ బడి పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. నేనూ ప్రభుత్వ బడిలోనే చదువుకున్నానని, నన్ను చూసి మా టీచర్లు సంతోష పడతారన్నారు. విద్యార్థి ఎదుగుదల టీచర్లకే సాధ్యమని స్పష్టం చేశారు.

డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని, రిచ్ కల్చర్ పేరుతో తప్పుడు మార్గాలు పట్టొద్దని, సమాజం కోసం పరితపించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టుకునేలాగా విద్యార్థులు కష్టపడాలన్నారు. క్షణిక ఆనందం కోసం జీవితాలను పాడు చేసుకోవద్దన్నారు. అనంతరం డ్రగ్స్ మహమ్మారిని అంతం చేస్తామని విద్యార్థుల చేత మంత్రి సీతక్క ప్రతిజ్ఞ చేయించారు.

Exit mobile version