విధాత : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు.
నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్ఆర్ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో పరిశ్రమలు, మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామని శ్రీధర్బాబు పేర్కోన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సరళీకృత విధానాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, అనుమతులు, మౌలిక వసతుల కల్పనపై తక్షణ చర్యలు తీసుకుని పెట్టుబడుల రాకకు, పరిశ్రమల విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.