హిందూ,ముస్లింల మధ్య కోట్లాట పెట్టాలని చూస్తున్న మోదీ
పెగ్గు మీద పెగ్గు వేసినట్లు కుర్చి మీద కుర్చి వేసుకుంటారా?
రైతులను పోలిసులతో కొట్టించిన దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి
మీ రాజకీయ భవిష్యత్కు అండగా ఉంటా
రామ లక్ష్మణుల్లా కలిసి పని చేయండి
పఠాన్ చెరువు కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్
విధాత: మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం పఠాన్ చెరు కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడంలేదన్నారు. ఈ ఎన్నికలు రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ, అమిత్ షా… రాంచంద్రపురం వరకు మెట్రో విస్తరణకు నిధులు ఇస్తామని చెప్తారనుకున్నాం.. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కి నిధులు ఇస్తారనుకున్నాం … బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావిస్తారనుకున్నాం.. కానీ ఇవేవీ ఇవ్వకుండా.. హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కత్తులతో పొడుచుకుని రక్తం చిందించాలని చూస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయా అని అడిగారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలి… ప్రజలు కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ అన్నారు.
నీలం మధు గెలిస్తేనే అభివృద్ది
పఠాన్ చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిదని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు కలిసి ఉంటారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీలం మధు ఎంపీగా గెలవాలన్నారు. నీలం మధు, కాటా శ్రీను రామ లక్ష్మణుల్లా కలిసి పని చేయండి.. మీ రాజకీయ భవిష్యత్ కు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో మెదక్ అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మాదని రేవంత్ స్పష్టం చేశారు. మొన్నటి వరకు బీఆరెస్ బీజేపీ వాళ్లు ఎంపీలుగా ఉండి, ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయండన్నారు.
పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు
మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి అని రేవంత్ అన్నారు. వేల కోట్లు సంపాదించుకున్న ఆయన.. కేసీఆర్, హరీష్ కు వందల కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకుండని ఆరోపించారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బీఆరెస్ అభ్యర్థి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు, పెగ్గు మీద పెగ్గు వేసినట్టు కుర్చీ మీద కుర్చీ వేసుకుంటారా? అని అడిగారు. ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించామని రేవంత్ చెప్పారు. రిజర్వేషన్లు కాపాడలంటే కాంగ్రెస్ కు అండగా ఉండి, నీలం మధును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మెదక్ నియోజకవర్గ ప్రజలను కోరారు.