పూజారుల బదిలీలు ఆపి.. బ్రాహ్మణ పరిషత్కు నిధులివ్వండి
విధాత, హైదరాబాద్ : స్వయంభూదేవాలయాలతో పాటు వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజారులను బదిలీ చేయడం తగదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సీఎం రేవంత్రెడ్డికి హితవు పలికారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రభాకర్.. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజారులను మార్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి మందలించిందన్నారు.
దేవాలయాల్లో తలదూర్చుకు మిత్రమా అని ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఎండోమెంట్ శాఖ పరిధిలోని పూజారులు, అర్చకుల బదిలీపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ జీవో 80, రెవెన్యూ శాఖ(ఎండోమెంట్) జీవో 64 జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు ఇటీవల ఈ జీవోలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.
ఏడు నెలలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు కేటాయించలేదని రానున్న బడ్జెట్ లో ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేదపడింతులు, బ్రాహ్మణులు జీవితాలతో చెలగాటం ఆడవద్దని హితవుపలికారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు