- జనవరి 13 నుండి నీటి విడుదల
- 8 నుంచి 10 విడతల్లో అందనున్న సాగునీరు
- సాగునీటి సలహా కమిటీ తీర్మానం: అదనపు కలెక్టర్ రమేష్
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: ప్రస్తుత యాసంగి సీజన్ లో మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ఘనపూర్ ప్రాజెక్ట్ ఆనకట్ట కింద ఉన్న 21,625 ఎకరాలకు జనవరి 13 నుండి ఏప్రిల్ రెండవ వారం వరకు విడతల వారీగా సాగునీటిని విడుదల చేయనున్నట్టు అదనపు కలెక్టర్ రమేష్ చెప్పారు.
గురువారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తో కలిసి ఇంజనీరింగ్ అధికారులు, బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 18న మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్ట్ కు జనవరి13 న నీటిని విడుదల చేయాలని సమావేశం తీర్మానించిందని అన్నారు.
కాగా 8 నుంచి 10 విడతలలో సాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే జిల్లాలో 10 ట్యాంక్ ల క్రింద 500 ఎకరాల పైన ఆయకట్టు కలిగిన 6,300 ఎకరాలకు చెరువుల ద్వారా సాగు నీటిని అందించనున్నామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా నీటి పారుదల కాలువలు నిర్మించవలసి ఉన్నా, లైనింగ్ లేదా గైడ్ వాల్ నిర్మించాల్సిన పనులు గుర్తించి ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టడానికి ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
గ్రామాలలో రైతులు ఇష్టం వచ్చినట్లు తూముల ద్వారా నీటిని అక్రమంగా వినియోగించకుండా తూముల ద్వారా నీటిని వదలడానికి అవసరమైన సిబ్బందిని ఆ గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ సూచించారు.
నీటి విడుదలపై రైతులు సమాచారం తెలుసుకొనుటకు వీలుగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ యాసంగి సీజన్ లో రైతులకు సక్రమంగా సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో హల్దీ వాగు, మంజీర, చెరువులు, ట్యాంకులు నిండుకుండలా ఉన్నాయని సాగునీటికి ఇబ్బంది లేదని అన్నారు.
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకుని, నింపుకున్నామని తద్వారా భూగర్భ జలమట్టం కూడా పెరిగి, విద్యుత్ వినియోగం కూడా తగ్గిందని అన్నారు. ఇంకా ఏ మండలంలో, ఏ గ్రామంలో భూగర్భ జలాలు తక్కువ ఉన్నాయో గుర్తిస్తే తగు చర్యలు తీసుకోవచ్చని సూచించారు.
సమావేశంలో నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ యేసయ్య, ఈ ఈ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ సాయి రామ్, ఉద్యాన శాఖాధికారి నర్సయ్య, సీపీఓ మహమ్మద్ ఖాసీం, బోర్డు సభ్యులు సుభాష్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రామకిషన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు సోములు, డిప్యూటీ ఇంజనీర్లు, సహాయ ఇంజనీరింగ్ అధికారులు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.