మీదాకా వస్తేగానీ నొప్పి తెలియలేదా?
కేసీఆర్.. ముందుంది ముసుర్ల పండగ
కాంగ్రెస్తో పెట్టుకుంటే పుట్టగతులుండవ్
కేసీఆర్కు ఇక రాజకీయ మనుగడ లేదు
మహబూబ్నగర్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
(విధాత, ఉమ్మడి మహబూబ్నగర్ ప్రతినిధి) : కాంగ్రెస్లో బీఆరెస్ ఎమ్మెల్యేల చేరిక అప్రజాస్వామికం అంటున్న కేటీఆర్కు ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు అప్రజాస్వామికం అనిపించలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిలదీశారు. మంగళవారం మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము బీఆరెస్లా దొంగ దెబ్బ తీయడం లేదని, వారికిలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదని అన్నారు. ‘కేసీఆర్… ముందుంది ముసుర్ల పండగ’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
బీజేపీ, బీఆరెస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా.. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు’ అన్నారు. చేతనైతే అభివృద్ధికి సహకరించాలని లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చోవాలని కేసీఆర్కు ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. నాలుగు రోజులుగా హరీష్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తనదాకా వస్తేకానీ వాళ్లకు నొప్పి తెలియలేదన్నారు.
గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారని, కోచింగ్ సెంటర్ల మాఫియా కూడా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తున్నదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పార్టీ బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారని, విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ‘హరీష్, కేటీఆర్ కు సవాల్ విసురుతున్నా… పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి.. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయండి. పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండి.
మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే.. బిల్లా, రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగండి’ అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని, నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. కేసీఆర్ కు బీఆరెస్ కు పుట్టగతులు ఉండవనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించాం. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాం’ అని తెలిపారు. ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యెనుగుల బలం వస్తుంది. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలు ప్రభుత్వం పాటిస్తుంది’ అని పార్టీ నేతలనుద్దేశించి చెప్పారు.
‘నాయకుల ఎన్నికలు ముగిశాయి… మీ కోసం కష్టపడే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో నాయకులు మీ కోసం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నాయకులకు ఆదేశించా’ అని తెలిపారు. ‘పీసీసీ అధ్యక్షుడిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్నా. నాకు అండగా నిలబడ్డ ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు’ అని రేవంత్రెడ్డి చెప్పారు.