ఊరూరా ఉత్సవంగా స్పెషల్ డ్రైవ్
9164 కిలోమీటర్ల మేర రోడ్ల క్లీనింగ్
6135 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువల శుభ్రత
నాటిన మొక్కలు 8,02,008
10,844 గ్రామపంచాయతీలు, 14,016 పాఠశాలల్లో వ్యాసరచన ఉపన్యాస పోటీలు
20,359 ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో క్లీన్ అండ్ గ్రీన్
మరుగుదొడ్లు లేని 40, 888 గృహాల గుర్తింపు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. తొలి రోజు సోమవారం ఊరూరా ఉత్సవంగా స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని లక్షల మొక్కలను నాటినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేల కిలోమీటర్ల మేర రహదారులను, మురుగునీటి కాలువలను శుభ్రపరిచినట్లుగా తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించగా.. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధి కారులు స్పెషల్ డ్రైవ్ లో పాలుపంచుకున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 5వ తేదీన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో 6వ తేదీన తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, 7వ తేదీన నీరు నిలిచిన ప్రాంతాలు, గుంతల పురుషుల పూడ్చివేత, 8న కుక్కల బెడద నివారణతో పాటు ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టడం, 9న ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో.. మొదటి రోజు పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా గ్రామగ్రామాన కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమం చేపట్టిన మొదటి రోజే 9164 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరుచగా, గ్రామాల్లో 6135 కిలోమీటర్ల మేర మురుగు నీటి కాలువలను శుభ్రం చేశారని ప్రభుత్వం వెల్లడించింది. 8.02 లక్షల మొక్కలను నాటగా, 20,359 ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలను శుభ్రపరిచారని, స్వచ్ఛదనం-పచ్చదనం డ్రైవ్ లో భాగంగా 40, 888 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని గుర్తించామని తెలిపారు. 10, 844 గ్రామపంచాయతీల్లో, 14,016 పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్ధులను సన్మానించినట్లుగా పేర్కోన్నారు.