తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..! దర్శనానికి వెళ్లేందుకు స్పెషల్‌ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, చాలామందికి దర్శనం టికెట్ల దొరక్క ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది

  • Publish Date - November 15, 2023 / 03:54 AM IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, చాలామందికి దర్శనం టికెట్ల దొరక్క ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్‌ ప్యాకేజీ మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు సాగనున్నది. ప్యాకేజీలో తిరుమలో శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, తిరుచానూర్‌ తదితర ఆధ్మాత్యిక ప్రదేశాలను సందర్శించే ఛాన్స్‌ ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ‘పూర్వా సంధ్యా’ పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ నెల 21న టూర్‌ ప్యాకేజీ మొదలవుతుంది.


పర్యటన సాగేదిలా..


పర్యటన తొలిరోజు ఈ నెల 21న సాయంత్రం మొదలవుతుంది. లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 5.25 గంటలకు, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 6.10 గంటల పది నిమిషాలకు నారాయణాద్రి రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. రెండోరోజు ఉదయం 5.55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి వెళ్తారు. ఫ్రెష్‌ అప్‌ అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను దర్శిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తారు.


అనంతరం అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తారు. రాత్రి తిరుపతిలోనే బస ఉంటుంది. మూడోరోజు అల్పాహారం పూర్తి చేసుకొని హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తారు. సాయంత్రం 6.25 గంటలకు మళ్లీ తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. ఉదయం 5.35 గంటలకు రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.


ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే..


ఐఆర్‌సీటీసీ పూర్వా సంధ్యా ప్యాకేజీని రెండు కేటగిరిల్లో అందిస్తున్నది. స్టాండర్డ్‌, కంఫర్ట్‌ క్లాస్‌ అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్‌ క్లాస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యపెన్సీకి రూ.7,720 ధర నిర్ణయించగా.. డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.5860, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,660 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.9570, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,720, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7,510గా నిర్ణయించారు.


అలాగే, 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలోనే ఏసీ హోటల్‌లో వసతి సదుపాయం ఉంటుంది. ఏసీ వాహనంలోనే ప్రయాణం ఉంటుంది. దర్శనం టికెట్లు సైతం ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. టూర్‌ గైడ్‌, బ్రేక్‌ఫాస్ట్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. పూర్తి వివరాలు irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.

Latest News