విధాత: ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకిన ఘటన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారం, ప్రత్యేక కారాగారంలోని ఖైదీలకు సెప్టెంబర్లో హెచ్ఐవీ పరీక్షలు జరిపారు. ఇందులో 85 మంది ఫలితాలు పాజిటివ్గా వచ్చాయి. ఈ స్థాయిలో వైరస్ సోకడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే హెచ్ఐవీ సోకిన ఖైదీలంతా డ్రగ్స్కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలు తీసుకొనేటపుడు వాడే సిరంజిల కారణంగానే ఈ స్థాయిలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వైద్యుల నివేదికను కారాగార అధికారులు కూడా ధ్రువీకరించారు.