క్రితంరోజుతో పోల్చితే తగ్గిన కరోనా ఉద్ధృతి
విధాత,దిల్లీ: గత కొంతకాలంగా కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 30 నుంచి 40వేల చేరువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. ముందురోజుతో పోల్చితే 27.9 శాతం మేర క్షీణించాయి. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెలువరించింది.
తాజాగా 13,94,573 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,941 మందికి పాజిటివ్గా తేలింది. తగ్గిన పరీక్షల సంఖ్య కూడా కేసుల్లో తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక ఒక్క కేరళలోనే 19వేల కేసులు వెలుగుచూశాయి. ఈ లెక్కన దేశంలో మిగిలిన ప్రాంతాల్లో మొత్తం 11 వేలు నమోదకాగా.. కేరళలో 19 వేల కేసులు బయటపడటం అక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిచేస్తోంది. నిన్న 350 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 3,70,640 మంది కొవిడ్తో బాధపడుతుండగా.. 24 గంటల వ్యవధిలో 36,275 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.13 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.
గతేడాది కరోనా మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి 3.27 కోట్ల మందికి పాజిటివ్గా తేలింది. 3.19 కోట్ల మంది వైరస్ను జయించారు. 4,38,560 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క నిన్న 59,62,286 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 64 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం తెలిపింది.