లక్న,విధాత: ముస్లింలు భారత్లో ఉండకూడదని ఎవరైనా అంటే అతడు హిందువే కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆదివారం నిర్వహించిన ఖ్వాజా ఇఫ్తేకర్ అహ్మద్ రచించిన ‘మీటింగ్ ఆఫ్ మైండ్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని, హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒక సంస్థ అని సంఘ్ ఎప్పుడూ విశ్వసిస్తుందని అన్నారు. మైనారిటీలకు సంఘ్ వ్యతిరేకంగా ఉందని లేదా భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందని భయపడేవారికి వ్యతిరేకంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు.‘గత 40,000 సంవత్సరాల నుండి మనమంతా అదే పూర్వీకుల వారసులమని నిరూపించబడింది. భారతదేశ ప్రజలకు ఒకే డీఎన్ఏ ఉంది. హిందూ, ముస్లిం అనేవి రెండు సమూహాలు కాదు. ఏకం కావడానికి ఏమీ లేదు. వారు ఇప్పటికే కలిసి ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.