విధాత,నోయిడా: దేశంలోని అతిపెద్ద డాగ్స్ పార్క్ నిర్మాణం గురించి కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. యూపీలోని నోయిడా అథారిటీ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. తాము నిర్మించబోతున్న ఈ కుక్కల పార్కు దేశంలోనే అతిపెద్ద పార్కు అవుతుందని పేర్కొంది. ఈ పార్కులో కుక్కలు నడిచేందుకు నడక మార్గాలు, అవి ఊగేందుకు ఉయ్యాలలు, జిమ్లతోపాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
ఈ పార్కును రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ పార్కు నిర్మాణానికి సుమారు రూ. 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఈ పార్కును నోయిడాలోని సెక్టార్-137లో నిర్మించనున్నారు. ఈ డాగ్స్ పార్కులో కుక్కల ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే పశువైద్య నిపుణులు, కుక్కల ట్రైనర్లు అందుబాటులో ఉంటారు. అయితే కుక్కలకు సంబంధించిన సేవలు పొందాలంటే వాటి యజమానులు తగిన రుసుము చెల్లించాల్సివుంటుంది. పార్కులో కుక్కలకు ప్రవేశం ఉచితం. కాగా తెలంగాణలో ఇప్పటికే ఒక డాగ్ పార్క్ ఉంది. దీనిని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్మించింది.