ప్రస్తుతం పిల్లలు ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగుతున్న జనరేషన్‌లో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ల శరీరంలో మార్పులు, ఆలోచన విధానం కూడా అంతే వేగంగా మారుతోంది. బాల్యంలోనే ప్రౌడ దశ లక్షణాలు కనిపిస్తున్నాయి.

పూర్వం ఇంట్లో ఆడపిల్ల యుక్తవయస్సుకు వచ్చిందంటే రజస్వల అయితే గుర్తించే వారు. అంటే 13-14ఏళ్ల వయసులో అమ్మాయిలు రజస్వల అయ్యేవారు. కాని ఇప్పుడు పిల్లలు తినే తిండి, స్ట్రెస్, పేరెంట్స్ జీన్స్ వల్ల 10 సంవత్సరాల లోపు బాలికలు రజస్వల అవుతున్న పరిస్థితులు ఉన్నాయి

చిన్న వయసులో రజస్వల అయితే ఆరోగ్యపరంగా పలు సమస్యలకు దారి తీసే అవకాశముందని  డాక్టర్స్ చెప్తున్నారు. సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాల మధ్య రజస్వల కావడం సాధారణ ప్రక్రియ. అయితే 10 ఏళ్లకు ముందే రజస్వల అయితే దాన్ని “ఎర్లీ మీనార్కి”గా పరిగణిస్తామని చెప్పారు.

చిన్న వయస్సులోనే రజస్వల అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంపై ఎక్కువ కాలం ప్రభావం చూపుతుంది. దీని వల్ల భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా పీసీఓఎస్ , పీరియడ్స్ అసమాన్యత, అధిక బ్లీడింగ్ వంటి సమస్యలు రావచ్చని తెలిపారు

అంతేకాకుండా భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా వంటి సమస్యల రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు.  పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు

ప్రతిరోజూ వ్యాయామం చేయించడం, ఆటలు ఆడేలా ప్రోత్సహించడం అవసరమన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.

చిన్న వయస్సులో ఎక్కువ బ్లీడింగ్ జరిగితే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ఐరన్ ఆహారం తీసుకోవడం అవసరమని తెలియజేశారు.

10 సంవత్సరాల లోపు రజస్వలైతే నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహాలు తీసుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా భవిష్యత్తు సమస్యలను తగ్గించవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు.