సాధారణంగా గొడవలు జరిగినప్పుడు కోపంలో ఇంట్లో ఆడవారి పేర్లతో బూతులు తిట్టడం సమాజంలో బాగా అలవాటుగా మారిపోయింది. ఇలాంటి మాటలను చాలా మంది ప్రశ్నించకుండా వదిలేస్తుంటారు.

కానీ మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా శ్రీగొండ తాలూకాలో ఉన్న కొల్గావ్ గ్రామం మాత్రం ఒక గొప్ప నిర్ణయంతో ముందుకు వచ్చింది. సుమారు తొమ్మిది వేల జనాభా ఉన్న ఈ వ్యవసాయ ఆధారిత గ్రామంలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారు కలిసి జీవిస్తున్నారు. 

ఎవరైనా సరే తల్లీచెల్లెళ్ల పేర్లతో బూతులు తిడితే ఏకంగా 500 రూపాయల జరిమానా విధించేలా గ్రామ పంచాయతీ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించింది.. మహిళా గ్రామ సభలో ఈ కఠినమైన రూల్ తీసుకువచ్చారు.

భాషలో గౌరవం లేకపోతే సమాజంలో మార్పు రాదని బలంగా నమ్మిన ఈ గ్రామస్థులు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ అరుదైన నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ జరిగే సంభాషణల్లో మహిళలను కించపరిచేలా మాట్లాడటం సాధారణంగా మారిపోయిన ఈ రోజుల్లో,

ఇలాంటి చెడు అలవాటును పూర్తిగా రూపుమాపేందుకు గ్రామ సర్పంచ్ పురుషోత్తం లగడ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిపాదనను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇలా వసూలు చేసిన జరిమానా డబ్బును గ్రామ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఇదే గ్రామ సభలో పరిశుభ్రతకు సంబంధించి మరో ముఖ్యమైన తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఎవరైనా తమ ఇళ్లు లేదా దుకాణాల పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచితే, దానికి సంబంధించిన ఫోటో ఆధారంగా 100 రూపాయల జరిమానా విధిస్తారు.

కొల్గావ్ గ్రామం ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నుంచి ఈ గ్రామంలో మరో అద్భుతమైన నియమాన్ని పాటిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పిల్లలు చదువుకునే సమయంలో ఇళ్లలో ఎవరూ టీవీలు చూడరు, మొబైల్ ఫోన్లు వాడరు