విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. సీబీఐ విచారణను డివిజన్ బెంచ్ సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. పిటిషన్ను కొట్టివేస్తూ సీబీఐకి కేసు విచారణను అప్పగించింది.
సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించడంతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్తో దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే, అడ్వకేట్ జనరల్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్ను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో గత నెల 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోబీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారించింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని రోహిత్రెడ్డి తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా.. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.