Panjagutta PS : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు మొత్తం 86 మంది సిబ్బందిని ఏఆర్కు అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వీరి స్థానంలో వివిధ పోలీసు స్టేషన్లకు సంబంధించిన సిబ్బందిని నియమించారు. సీపీ శ్రీనివాస్ రెడ్డి నిర్ణయంతో హైదరాబాద్ పోలీసులు షాక్ అయ్యారు. పీఎస్లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి విషయంలో.. కీలక సమాచారాన్ని మాజీ ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాగుట్ట సిబ్బందిపై వేటు పడిందని సమాచారం. ఈ ఒక్క కేసులోనే కాకుండా పలు కేసుల్లోని కీలక విషయాలను ఎప్పటికప్పుడు బయటకు చేరవేస్తున్నారని సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీపీ నిర్ణయం సంచలనంగా మారింది.