Site icon vidhaatha

సింగ‌రేణిలో 485 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. గురువారమే విడుదల : భట్టి విక్రమార్క

విధాత‌: సింగ‌రేణిలో ఖాళీగా ఉన్న 485 పోస్టుల భ‌ర్తీకి వెంట‌నే నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణీ సీఎండీ బ‌ల‌రామ్‌నాయ‌క్‌ను ఆదేశించారు. ఇందులో 317 డైరెక్రూట్‌మెంట్ పోస్ట్‌లు, 168 ఇంట‌ర్న‌ల్ రిక్రూట్‌మెంట్ పోస్ట్‌లున్నాయ‌న్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల‌పై స్పంధించిన సీఎండీ గురువారం నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. అలాగే కారుణ్య నియామ‌కాల ప్ర‌క్రియ‌ను వేగంగా చేప‌ట్టాల‌న్నారు. ఈ ఏడిలో క‌నీసం1000 మంది వారుసుల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు బుధ‌వారం స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి సింగ‌రేణిపై సంస్థ సీఎండీఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇతర అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. నోటిఫికేష‌న్ల ప్ర‌క్రియ ప‌క‌డ్భందీగా ఉండాల‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఏలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న రూ.కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగ‌తి గురించి ఆరా తీశారు. ప్ర‌మాదభరితమైన బొగ్గు రంగంలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ను క‌ల్పించిన వార‌మ‌వుతామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోల్ ఇండియాలోనూ ఇలాంటి ఒప్పందం లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని సీ.ఎండి బ‌ల‌రామ్ డిప్యూటీ సీఎంకు వివరించారు. కోటి ప్ర‌మాద బీమాపై కార్మికులకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని డిప్యూటి సీఎం సూచించారు.


సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఈ నెల 26వ తేదీన ఆవిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని డిప్యూటి సీఎం సింగ‌రేణి అధికారులను ఆదేశించారు. సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మిగిలిన సోలార్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగులు, అధికారుల సౌక‌ర్యార్ధం హైదరాబాద్ లో నిర్మించతలపెట్టిన అతిథి గృహం భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరై శంకుస్థాప‌న చేస్తామ‌న్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సహకారం అందించేందుకు ప్ర‌భుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


గోదావరిఖని, మంచిర్యాల కార్మికులకు సురక్షిత మంచినీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ర్యాపిడ్ గ్యావిటీ ఫిల్టర్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలన్నారు. డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సీఎండీ బ‌ల‌రామ్ నాయ‌క్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేర‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే వారసుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై అన్ని చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Exit mobile version