విధాత:‘‘ తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’’…చైర్మన్గా సోమా భరత్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం గారి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమా భరత్ కుమార్ ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను భరత్కుమార్ కలిసి నియామక ఉత్తర్వును అందుకుని మాట్లాడుతూ తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించి ఆశీర్వదించారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోమా భరత్ కుమార్ (62), పార్టీ ఆవిర్బావం నుంచి సీఎం కేసీఆర్ గారి వెంట ఉన్నారు. సూర్యాపేట జిల్లా, తుంగతూర్తి నియోజకవర్గం, వర్థమానుకోట గ్రామ వాస్తవ్యుడు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమా భరత్ కుమార్ వృత్తి రీత్యా ప్రముఖ సీనియర్ అడ్వకేట్గా సేవలందిస్తూ పేరుగాంచారు.
తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజాస్వామిక స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నారు. నాటి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అప్పగించిన బాధ్యతలను కర్తవ్యధీక్షతో నిర్వర్తిస్తూ, పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
అటు అధినేత విశ్వాసాన్ని ఇటు పార్టీ నేతల అభిమానాన్ని చూరగొంటూ పార్టీకోసం పనిచేస్తున్న సోమా భరత్కు పార్టీ లో ఓపికస్తుడుగా, సౌమ్యుడిగా పేరుంది. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్ డైరీ డెవలప్ మెంట్ చైర్మన్గా నియమించడం పట్ల నాటి ఉద్యమకారుల్లో తెలంగాణ వాదుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.