ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానంటూ కోన వెంక‌ట్ షాకింగ్ కామెంట్స్

  • Publish Date - April 4, 2024 / 10:27 AM IST

టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించారు. శ్రీను వైట్ల‌- కోన వెంక‌ట్ కాంబో అంటే జ‌నాల‌లో ఓ క్రేజ్ ఉండేది. అయితే త‌న రైటింగ్‌తోనే మంచి హిట్స్ అందుకున్న కోన వెంక‌ట్ ఆ మ‌ధ్య గీతాంజ‌లి అనే సినిమా చేశారు. ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, సత్య, అలీ, షకలక శంకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. 2014లో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇప్పుడు దానికి సీక్వెల్ చేసే ఆలోచ‌న చేస్తున్నారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్ర ట్రైలర్ విడుదల చేయ‌గా, ఈ క్ర‌మంలో మీడియా స‌మావేశం కూడా ఏర్పాటు చేశారు.

కోనా వెంకట్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంచెబుతూ.. ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తానంటూ చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇప్పటికే ఎన్టీఆర్- కోన కాంబినేష‌న్‌లో అదుర్స్ , బాద్‌షా, జై లవకుశ సాంబ చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తే.. బాద్‌షా, జై లవకుశ జస్ట్ హిట్స్‌గా, సాంబ యావరేజ్ గా నిలిచింది.అయితే అదుర్స్ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా కోనా వెంకట్ రచయితగా పని చేశారు. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ డ్యూయ‌ల్ పాత్ర పోషించాడు. బ్రాహ్మ‌ణుడి పాత్ర‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆయ‌న చేసిన సంద‌డి ఓ రేంజ్‌లో ఉంద‌ని చెప్పాలి. అదుర్స్ 2 కూడా వ‌స్తే బాగుండ‌ని ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుండో అనుకుంటున్నారు.

ఈ స‌మయంలో కోన వెంక‌ట్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అదుర్స్ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావాలని నాకు ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసి అయినా స‌రే ఎన్టీఆర్ ని ఆ సీక్వెల్ కి ఒప్పిస్తాను అంటూ కోన వెంకట్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. మరి కోన వెంక‌ట్ చెప్పిన తీరుని బ‌ట్టి చూస్తే అదుర్స్ చిత్రానికి సీక్వెల్ రావ‌డానికి ఇంకెంత స‌మ‌యం లేద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా వీలైనంత త్వ‌ర‌గా వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Latest News