Site icon vidhaatha

మూలా నారాయణస్వామి వర్ధంతి.. తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూలవిరాట్టు

విధాత:మల్లీశ్వరి,జయభేరి,దొంగరాముడు,దేవదాసు,బంగారు పాప,పాతాళభైరవి,మాయాబజార్ సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగం అని అంటూంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనపుడు తొలుత ఆ చరిత్ర లో తారసపడే పేరు మూలా నారాయణస్వామి!

కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘భక్త పోతన’ చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా నిర్మించిన సినిమా అఖండ విజయం సాధించింది. అయితే, సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి ‘వాహిని స్టూడియో’ కు నడుం కట్టారు మూలా నారాయణస్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం ‘గుణసుందరి కథ’. ఇది కూడా కె.వి.రెడ్డి దర్శకుడుగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది! మొదట కె వి రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బి.యన్.రెడ్డి అభ్యంతరం చెప్పారు. మూలా నారాయణ స్వామి పట్టువదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు! దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో, మూలా నారాయణ స్వామి ముగింపు అంతకు మించిన ఉత్కంఠ కల్గిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూలానారాయణస్వామి తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం!

తాడిపత్రికి చెందిన మూలా నారాయణస్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. తన చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే, ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు గొప్పగా వృద్ధి చేశాడు మూలా వారు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్ పరిశ్రమ, సహకార బ్యాంకు, పాల సహకార సంఘం, మార్కెట్ యార్డులు, పళ్ళ క్యానింగ్ ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంకు, రాయలసీమ టెక్స్ టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలెక్ట్రానిక్ కంపెనీ వంటి పేర్లు ఉండేవి. వీరికి బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలసి బర్మాలోని రంగూన్ కు ఉల్లిపాయలు ఎగుమతి చేసి లాభాలు గడించేవారు. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీరా టాకీస్ మూలానారాయణస్వామికి ఉండేవి.

బిఎన్ రెడ్డి, కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి గలిగినవారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలసి హెచ్ ఎం రెడ్డి భాగస్వామ్యంతో ‘గృహలక్ష్మి’ రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్.ఎం. రెడ్డితో సర్దుకోలేక – వాహినీ సంస్థను నెలకొల్పారు. నిరుద్యోగ సమస్యతో ‘వందేమాతరం’ : విధవా వివాహాలను సమర్ధిస్తూ ‘సుమంగళి’; ఇంకా ‘దేవత’ సినిమాలను వాహిని సంస్థ నిర్మించి చరిత్ర సృష్టించింది. ఇది 1938-1942 మధ్యకాలం. తరవాత బాల్యమిత్రుడైన కెవి రెడ్డిలో వ్యాపారి మూలా నారాయణస్వామి ఏమి చూశారో కానీ, మహాసాహసంతో తెలుగు సినిమా స్వర్ణయుగానికి గొప్ప రంగస్థలాన్ని తద్వారా రూపొందించి చారిత్రక పురుషుడిగా మారారు. నిజానికి కె వి రెడ్డి అప్పటికి ఆ సంస్థ లో కేషియర్ మాత్రమే. ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేయలేదు. అందుకే మూలా నారాయణస్వామి దార్శనికుడు!

‘భక్త పోతన’ నిర్మించినపుడు న్యూటోన్ స్టూడియోలో ఇబ్బందులు గమనించి రెండున్నర లక్షల వ్యయంతో వాహినీ స్టూడియో ఏర్పాటయ్యింది. ఇందులో రెండు లక్షలు మూలా నారాయణ స్వామివి కాగా మిగతా యాభైవైలు బిఎన్ రెడ్డి, బి. నాగిరెడ్డి తదితరులది. ఆ సంస్థకు నారాయణస్వామియే ఛైర్మన్. ఆయనకు ‘ఆంధ్రా బిర్లా’ అనే పేరు వుండేది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ విరాళాలు బాగా ఇచ్చేవారు. కస్తూర్బా ఫండ్ కు ఆ రోజుల్లో ఒక లక్షరూపాయలు విరాళం ఇచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు రెడ్డి గారి పూర్వాపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. మూలా నారాయణస్వామి తోడ్పాటుతో ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు.

1938-1949 మధ్యకాలంలో గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్త పోతన – గుణసుందరి కథ మధ్య ఏడు సంవత్సరాల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్తా ముందు ఇన్ కమ్ టాక్స్ సమస్యల్లో మూలా నారాయణస్వామి ఇరుక్కోవడం సంభవించింది. ముప్ఫై లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహినీ స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయ్యింది. నారాయణస్వామికి నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కష్టాలు ముప్పిరిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 1950 ఆగస్టు 20న 38 సంవత్సరాల వయసులో నారాయణస్వామి కనుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకటరంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. 1961లో దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారని అంటారు.

ఏది ఏమైనా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూల విరాట్టు అయిన మూలా నారాయణ స్వామి పరిణామగతి ఆశ్చర్యకరం!

Exit mobile version