విధాత,హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అదిరిపోయే గేమ్లు.. లగ్జరీ బడ్జెట్ టాస్క్లు.. కెప్టెన్సీ కోసం పోటీలు కనువిందు చేయనున్నాయి. అంతులేని ప్రేమలు.. అంతలోనే గొడవలు.. ఎవర్గ్రీన్ స్నేహాలతో సందడి షురూ కానుంది. అదే అలరించే రియాల్టీ షో ‘బిగ్బాస్’. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్బాస్ తెలుగు’ ఇప్పుడు ఐదో సీజన్ మొదలైంది.
అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా ఆదివారం అదిరే గ్రాండ్ ఎంట్రీతో అలరించింది. క్లాస్, మాస్ సాంగ్లతో నాగ్ ఎంట్రీ అదిరింది. ‘‘పంచాక్షరాల సాక్షిగా.. పంచేంద్రియాల సాక్షిగా.. పంచ భూతాల సాక్షిగా.. నా పంచ ప్రాణాలు మీరే(అభిమానులు)’’ అంటూ నాగ్ ఈసారి ఐదు రెట్ల వినోదాన్ని పంచడానికి వచ్చారు. బిగ్బాస్ హౌస్ గురించి వివరిస్తున్న సందర్భంలో నాగార్జున కిచెన్లోకి వెళ్లగా, ‘సరసాలు చాలు శ్రీవారు’ అంటూ సాగే పాట వినిపించడంతో ‘బిగ్బాస్.. ఈ పాట ఇప్పుడు ఎందుకు వేశారు. నేను ఇంటికి వెళ్లాలి కదా’ అంటూ నవ్వులు పంచారు.
బిగ్బాస్ విశేషాలు ఇవీ
- బిగ్బాస్ ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.
- మొదటి సీజన్కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శివ బాలాజీ విజేతగా నిలిచారు
- రెండో సీజన్కు నాని యాంకరింగ్ చేశారు. కౌశల్ విజయం సాధించారు
- మూడు, నాలుగు సీజన్లను అగ్ర కథానాయకుడు నాగార్జున హోస్ట్ చేశారు . రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ విజయం సాధించారు.
- సెప్టెంబరు 5వ తేదీ నుంచి బిగ్బాస్ సీజన్-5 మొదలైంది.
- ముచ్చటగా మూడోసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
- బిగ్బాస్ హౌస్లో మొత్తం 70 కెమెరాలు ఉన్నాయి.
- బిగ్బాస్ హౌస్ లాంజ్ను ఎక్కువగా ఆకుపచ్చ రంగుతో తీర్చిదిద్దారు.