Savitri| వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మహానటి సావిత్రి నిజ జీవితంలో మాత్రం దారుణమైన పరిస్థితులని ఎదుర్కొంది. కెరీర్ జోరుమీదున్న సమయంలోనే జెమినీ గణేషన్ ని పిచ్చిగా ప్రేమించిన ఆమె ఆ తర్వాత లేనిపోని కష్టాలు చూసింది. పెళ్లికి ముందు వరకు మందు ముట్టని సావిత్రి తర్వాత మందులేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది. రానురాను సినిమా అవకాశాలు తగ్గడం, పెద్దగా చదువుకోని సావిత్రి అమాయకురాలు కావడం, ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియక ఎవరిని పడితే వాళ్లని నమ్మి ఎన్నో సమస్యలని కొని తెచ్చుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఎడబాటుని తట్టుకోలేకపోయింది. పూర్తిగా తాగుడుకు బానిసైంది.అలా జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకుంది.
ఎన్టీఆర్, ఏన్నార్, రాజ్ కుమార్ లాంటి అగ్రస్థాయి హీరోలకన్నా అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రికి చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరి దశలో కేవలం 500 రూపాయల అద్దెకు చెన్నపట్నానికి మారి, సావిత్రి సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో జీవితపోరాటం చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో పోరాటం చేయలేకపోయింది. 1981 డిసెంబరు 26 న శాశ్వతంగా వెళ్లిపోయింది. భావితరాలకి సావిత్రి పెద్ద నటనా నిఘంటువు అని చెప్పాలి. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు.
సావిత్రి, జెమినీ గణేషన్ దంపతులు పెళ్లయిన తొలి రోజుల్లో చెన్నై నగరం, అభిరామపురం అనే ఒక చిన్న గ్రామంలో ఉండేవారు. అప్పుడు జెమినీ గణేషన్, సావిత్రి చాలా బిజీగా ఉండడంతో ఓ పని మనిషిని హైర్ చేసుకుంది. అయితే ఆమె ఒకప్పుడు చాలా గొప్పగా బతికింది.కానీ విధి చిన్నచూపు చూడడంతో ఆస్తులన్నీ పోయాయి.చివరికి సావిత్రి ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి.. ఓ రోజు ఆ పని మనిషిని పిలిచి చూడమ్మా, మేమిద్దరం ఎప్పుడూ స్టూడియోల్లో బిజీగా ఉంటాం.ఇంకా మాకు పిల్లా పీచు ఎవరూ లేరు.మీరు ఇంట్లో చాలా దర్జాగా బతకవచ్చు అని అన్నారట. అప్పుడు ఆ పని మనిషి అయ్యో.. మీరు నాకు ఇబ్బంది అవుతుందని పిల్లలను కనకుండా ఉండొద్దు అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సావిత్రి, జెమినీ గణేషన్లకి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు పుట్టడంతో అన్నట్టుగానే ఇద్దరు పిల్లలని ఆ పని మనిషి కంటికి రెప్పలా చూసుకుంది.