Wyanad | కేరళ వయనాడ్లో కొండచరియలు విగిరిపడి పెద్ద ఎత్తున జనం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతంగా టూరిస్టులతో కళకళలాడిన ఈ ప్రాంతమంతా ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. తవ్విన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ వందలాది మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఈ ఘటన యావత్ దేశంలో విషాదాన్ని నింపింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రస్తుతం జాగిలాలను రంగంలోకి దింపి ఎవరైనా శిథిలాల్లో ప్రాణాలతో ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. మరో వైపు.. వయనాడ్ బాధితులకు సహాయమించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రముఖ నటి నయనతార దంపతులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.20లక్షలు విరాళం ప్రకటించారు. అదే సమయంలో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సైతం రూ.5లక్షలు ప్రకటించింది. హీరో సూర్య సతీమణి జ్యోతిక, సోదరుడి కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కార్ సల్మాన్ రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక మందన్న రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించినట్లు తెలుస్తున్నది.