All Parties
- సీఎం, కేటీఆర్, హరీష్ వరుస పర్యటనలు
- రేవంత్ క్లీన్ స్వీప్ టార్గెట్, భట్టి యాత్రతో కాంగ్రెస్ జోష్
- ఈనెల 25న నడ్డా రాకతో కమలం అడుగులు
- చేరికలపైనా పార్టీల నజర్
విధాత ప్రత్యేక ప్రతనిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో పొలిటికల్ కాక తీవ్ర ఎండలను తలపించేలా హీటెక్కింది. అధికార బీఆర్ఎస్ తో పాటుగా ప్రతిపక్ష కాంగ్రెస్, కమలం పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తూనే చేరికలతో బలం పుంజుకునేలా ఎత్తులు వేస్తున్నాయి.
బీఆర్ఎస్ దూకుడు
అధికార టీఆర్ఎస్ ఈ అంశంలో ప్రతిపక్షాలకంటే ముందుంది. సీఎం కేసీఆర్ ఇటివలే నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించి భారీ ఎత్తున జనసమీకరణ చేసి బల ప్రధర్శన సభలు నిర్వహంచారు. ఈ బహిరంగ సభల్లో ప్రతిపక్షాలను ఎండగట్టారు.
ధరణి తీసేస్తామన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలని, బీఆర్ఎస్ లేకుంటే రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లు జరగవని, కాంగ్రెస్, బీజేపీ మాటలను నమ్మ వద్దని ప్రజలకు సూచించారు. ఇక మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సైతం మహబూబ్నగర్, అచ్చంపేట, జడ్చర్ల, తదితర నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో, సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలని తూర్పారబడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ సాధించి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో నింపుతున్నారు. ఇప్పటికే ముగిసిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో, ప్రస్తుత దశాబ్ది ఉత్సవాలతో క్యాడర్ లో హుషారు నెలకొంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు.
క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్…!
కాంగ్రెస్ పార్టీ సైతం తగ్గేదేలే అనేలా కార్యక్షేత్రంలో ముందుకు సాగుతుంది. పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో మొత్తం అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యం పెట్టుకొన్నారు. ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడంతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.
త్వరలోనే ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితోపాటు పలువురు నాయకులు చేరే అవకాశం ఉంది. ఇటీవలే భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీలో ఉత్సాహం నింపింది. జడ్చర్ల, అచ్చంపేట, కొల్లాపూర్ లాంటి పలు నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని చాటింది.
నేనున్నానంటూ బీజేపీ…!
బీజేపీ నేనున్నానంటూ రాష్ట్ర, జాతీయ నాయకుల పర్యటనలతో క్యాడర్ లో జోష్ నింపుతోంది. గత కొంతకాలం క్రితం మహబూబ్నగర్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ అధినేత బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈనెల 25న నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తదితరులు పాలమూరులో కమలం పట్టు సాధించేలా అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద వానాకాలం వస్తున్న తరుణంలో పాలమూరులో రాజకీయ వేడి ప్రారంభం కావడం విశేషం.