విధాత: మునుగోడులో బీజేపీకి పరిస్థితులు కలిసిరావడం లేదు. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వైఖరి పాత బీజేపీ నాయకత్వానికి రుచించడం లేదు. బీజేపీ ఎంపీలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నామినేషన్ వేసిన రోజు వచ్చిందే. మళ్ళీ నియోజకవర్గం ముఖం చూడలేదు.
అరవింద్ కూడా ఆంటీ ముట్టనట్టు ఉన్నారు. పెద్ద నాయకులెవరు అటు రావడం లేదు. కొత్తగా పార్టీలో చేరినవారే మునుగోడు ఎన్నికను భుజానవేసుకుని మోస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ వివేక్, రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవ జరిగిందని, వివేక్ ప్రహారం మానేసి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరికొందరు నాయకులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు స్థానిక నాయకత్వం కూడా మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటని ఆగ్రహం ఉన్నదని సమాచారం. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారని ప్రచారం జరుగుతున్నది. ఇది వాస్తవమే అన్నట్టు ఆయన ఇటీవల తనకు వచ్చిన కాంట్రాక్టు విషయం గురించి ప్రస్తావించారు. ఇది కూడా మునుగోడు ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఇబ్బందికరంగా మారుతున్నదట. అట్లనే ఆయనే స్వయంగా ముసలోల్లతో మనకు సావు వచ్చిపడింది. వాళ్లు కారు గుర్తుకే వేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని ప్రచారంలో వ్యాఖ్యానించడం వాళ్లకు రుచించడం లేదట.
ముఖ్యంగా రాజగోపాల్రెడ్డి తనకు వచ్చిన రూ. 18 కోట్ల కాంట్రాక్టు వలె మునుగోడు అభివృద్ధికి కేంద్రం నుంచి రూ. 18 వేల కోట్లు తీసుకుని వస్తే పోటీ నుంచి తప్పుకుంటామనే మంత్రి జగదీశ్రెడ్డి సవాల్కు మంత్రి కేటీఆర్ దన్నుగా నిలబడడం గురించి ఇప్పుడు మునుగోడులో ప్రజలంతా చర్చించుకుంటున్నారు.
దుబ్బాక, హుజురాబాద్లో బీజేపీని గెలిపిస్తే ఆ నియోజకవర్గాలకు ఏం ఒనగూరింది అనే ప్రశ్నలు మునుగోడు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పలేక నాయకులు మొహం చాటేస్తున్న పరిస్థితి ఉన్నది. గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకుడిని మొన్నటిదాకా ముందుపెట్టి ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నుంచి నాయకులను తీసుకు వచ్చి కేసీఆర్, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడించినంత మాత్రానా ఫలితం ఉండదని ఆ పార్టీ నాయకులే అంగీరిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో చేరిన స్వామిగౌడ్, విఠల్, మొన్న చేరిన దాసోజు శ్రవణ్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఉద్యమకారులను కేసీఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను తిట్టడానికి టికెట్ల కేటాయింపుల విషయానికి వచ్చే సరికి బీజేపీ సిద్ధాంతాల కోసమే పనిచేసే వారిని కాదని ఇటీవల కాలంలో ధన బలం ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వడాన్నిజీర్ణించుకోలేకపోతున్నారట.
ఇట్లా అనేక సమస్యలు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఎదురువుతుండటం.. పరిస్థితి అనుకూలంగా లేకపోవడం.. బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహంతో ఉండటం వంటి కారణాలతో ఆ పార్టీలో ముసలం ముదిరి ప్రచారం నుంచి ఒక్కొక్కరూ మెల్లగా తప్పుకుంటున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది.