Chicken Prices Drop | ఆదివారం వచ్చిందంటే చాలా మాంసహార ప్రియులకు ముక్కలేనిదే ముద్దదిగదు మరి. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒక వంటకం ఉండాల్సిందే. మొన్నటి వరకు మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. మొన్నటి వరకు కొండెక్కిన కోడి ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపించాయి. మటన్ ధర కేజీ రూ.850పైనే ఉండగా.. చికెన్ రేటు సైతం రూ.350 వరకు పలికింది. దీంతో చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బందులుపడ్డారు. అయితే, తాజాగా చికెన్ ధరలు భారీగా దిగివచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చికెన్ కేజీ రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతున్నది. వర్షాలతో పాటు డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో టమాట చికెన్ ధరలను మించిపోయింది. కిలోకు రూ.200 వరకు పలుకుతోంది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో శనివారం కిలో టమాటా ధర రికార్డు స్థాయిలో రూ.196 పలికింది. ఈ ఇలాంటి పరిస్థితుల్లో కిలో టమాట కొనే బదులుగా కిలో చికెన్ తీసుకొని బిర్యానీ చేసుకోడమే బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చికెన్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
అయితే, వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ఇమ్యూనిటీని పెంపొందించుకునేందుకు చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మెున్నటి వరకు పెళ్లిళ్ల సీజన్, ఎండాకాలంలో కోళ్లు మృతి చెందడంతో ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సారి అధిక శ్రావణ మాసం ఉండడంతో చాలామంది మాంసహారానికి దూరంగా ఉండడంతో చికెన్కు డిమాండ్ తగ్గడంతో ధరలు అమాంతం దిగివచ్చిందని పేర్కొంటున్నారు. రెండు, మూడు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.