విధాత: నాసిరకం పుచ్చ విత్తనాలు అమ్మి ఎలాంటి రసీదులు ఇవ్వకుండా రైతులకు లక్షల రూపాయల నష్టానికి కారకులైన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
నాసిరకం పుచ్చ గింజల విషయంపై రైతులతో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ కనగల్, నిడమనూరు మండల రెవెన్యూ ప్రాంతాలకు చెందిన రైతులు నల్లగొండలోని “కర్షక్ మైక్రో ఇరిగేషన్ సిస్టం ఏజెన్సీ” నుండి డిసిఎస్ జిగ్నా గోల్డ్ పుచ్చ గింజలు కొనుగోలు చేశారు. కానీ ఈ సంస్థకు ఎలాంటి సీడ్స్ అమ్మే లైసెన్స్ లేదని ఇది నేరపూరితమైన చర్యని ఆరోపించారు.
ఈ సంస్థ యజమాని డి సి ఎస్ జిగ్నాగోల్డ్ పుచ్చగింజలు పెడితే ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుందని 60 రోజుల్లో పంట పండుతుందని మాయ మాటలు చెప్పి అనేక మంది రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకుండా అమ్మడం జరిగిందన్నారు. 80 రోజులైనా పంట చేతికి రాలేదు వచ్చిన పంట కూడా ఎకరానికి రెండు మూడు టన్నుల దిగుమతి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారన్నారు. దీంతో సుమారుగా ఒక ఎకరానికి మూడు లక్షల వరకు నష్టం వచ్చిందని దీనికి బాధ్యత సంబంధిత షాప్ యజమానిదే అన్నారు.
ఈ విషయంపై నవంబర్ 17వ తేదీన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కు, నవంబర్ 19న జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిననా నేటి వరకు సదరు కంపెనీ పై గాని, ఆ షాప్ యజమాని పై గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సమగ్రమైన విచారణ జరిపి సంబంధిత షాప్ యజమానిపై ఆ కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బాధిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ధర్నాలో ఎం .ఎస్. పి తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం, బీసీ విద్యార్థి సంఘం, ఎం.ఆర్.పి.ఎస్ నేతలు బకరం శ్రీనివాస్, పందుల సైదులు, మానుపాటి భిక్షం, అయితగోని జనార్దన్ గౌడ్, రైతులు మేడారం సైదులు, తెరపాటి వెంకన్న, గుండెబోయిన మహేష్ ,మర్రి గణేష్, డి సైదులు, సిహెచ్ ప్రవీణ్,బి లింగయ్య, సిహెచ్ శంకర్, బి గణేష్ ,కే నాగరాజు, రామన్న గౌడ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.