విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ నిన్న ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 6 ఆదివారం ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదైంది. 2018లో 91.3 శాతం పోలింగ్ నమోదు కాగా, ప్రస్తుతం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపును ఆదివారం చేపట్టనున్నారు.
నల్లగొండ పట్టణంలోని అర్జాలబావి వద్ద ఉన్న వేర్హౌస్ గోడౌన్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలి రౌండ్ ఫలితం 9 గంటలకు వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తిస్థాయి ఫలితం వెలువడనుంది.
ఓట్ల లెక్కింపులో భాగంగా 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఏంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు.
మొదట పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా.. మొదటగా చౌటుప్పల్ మండల పరిధిలో నమోదైన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను వరుసగా లెక్కించనున్నారు.
ఇప్పటికే కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్వో రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద CRPF బలగాలతో, cc కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదవగా.. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేలా అధికారులు అయా అభ్యర్థులకు అనుమతి ఇచ్చారు.