YCP |
విధాత: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సన్నద్ధమౌతోంది. ఇప్పటికే గెలుపు గుర్రాల్ని సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థుల జాబితా ముందుగా ప్రకటించడం ద్వారా ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో గందరగోళం దూరం చేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితా దసరా నాటికి విడుదల కావచ్చని అంతర్గత సమాచారం.
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
2024 ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా నేతలు, కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పట్నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించేశారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మొత్తం మూడు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని పార్టీ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి జాబితాను దసరా నాటికి విడుదల చేయవచ్చు.
వీరు ఖరారైనట్లే?
ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశి, చీరాల నుంచి కరణం వెంకటేశ్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన 7 సర్వేల ఆధారంగా సిటింగులకు లేదా కొత్తవారికి అవకాశమనేది ఇవ్వనున్నారు. ఈ విషయంపై వైఎస్ జగన్దే తుది నిర్ణయం కానుంది. అదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. తొలి దశ జాబితాలో 27 మంది కొత్త వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
రంగంలో సీనియర్లే..
అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడం ద్వారా నియోజకవర్గంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్ని అధిగమించవచ్చని పార్టీ వ్యూహంగా ఉంది. అదే సమయంలో వారసుల్ని రంగంలో దించాలని ఆలోచిస్తున్నవారికి జగన్ షాక్ ఇవ్వనున్నారు. ఈసారి కూడా సీనియర్లనే రంగంలో దించాలనేది జగన్ ఆలోచనగా ఉంది. పోటీ చేయలేని పరిస్థితులుంటే మాత్రం మినహాయింపు ఇస్తారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ పార్టీ కో ఆర్డినేటర్లుగా పని చేసినవారిలో కొందరికి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారు.
అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసి దూరమైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గాల్లో ఇతరులకు తొలి జాబితాలోనే టికెట్లు ఇవ్వనున్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో వైఎస్ జగన్ మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దసరా నాటికి తొలి జాబితా విడుదల చేసి..సంక్రాంతి తర్వాత తుది జాబితా విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.