విధాత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 2014 ఎన్నికల అనంతరం నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించడానికి ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.