Hyderabad Metro |
హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. మూడు, నాలుగేండ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మూడు, నాలుగేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రజా రవాణాను దేశంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సంకల్పించారు. ఇతర పట్టణాల మాదిరిగా తెలంగాణకు కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని నిర్ణయించారు.
రాయదుర్గం – ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోంది. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడుతామన్నారు.
ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు, మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు, ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించినట్లు తెలిపారు.
భవిష్యత్లో కొత్తూరు మీదుగా షాద్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తి చేస్తామన్నారు. ఎయిర్పోర్టు నుంచి కందుకూరు వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు.