లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో తెలంగాణ యువతి దారుణ హత్య (Murder) కు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి (27) మాస్టర్స్ డిగ్రీ కోసం లండన్ వెళ్ళి తన మిత్రులతో కలిసి వెంబ్లేలోని నీల్డ్ క్రిసెంట్ వద్ద షేర్డ్ అకామిడేషన్లో ఉంటున్నది. అక్కడ బ్రెజిల్కు చెందిన ఒక యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడని, చికిత్స పొందుతూ బ్రిటన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పది గంటలకు చనిపోయిందని తమకు సమాచారం ఇచ్చారని కుటుంబీకులు తెలిపారు.
యువకుడి దాడిలో ఆమె స్నేహితురాలు అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అఖిలకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సమాచారం. తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆరు నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్ళింది.
మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి చేసి ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తమ కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. తేజస్వినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.