Site icon vidhaatha

గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధనా సిబ్బందికి ఆహ్వానం

విధాత: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బందిగా పని చేయాలన్న ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ , న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ , పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ మెంట్, జియోగ్రఫీ తదితర కోర్సులు బోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామని, ఎంపిక చేయబడిన లెక్చరర్స్ గంటల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతి భాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సి వోలకు తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు.

Exit mobile version