Site icon vidhaatha

సమంత విషయంలో వస్తున్న వార్తలు నిజమేనా?

విధాత: తమిళనాడుకు చెందిన సమంత తెలుగు ప్రేక్షకులను తన నటనతో అందంతో మెప్పించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రంగ‌స్థ‌లం.. వంటి చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

అదే సమయంలో ఆమె వెబ్ సిరీస్‌లు, తమిళ చిత్రాలతో కూడా ఎప్పుడు బిజీగా ఉండేది. తన మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో తనకు హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను హిందు, క్రైస్త‌వ ప‌ద్ద‌తుల్లో గోవాలో వివాహం చేసుకొని ఆ తరువాత వ్యక్తిగత కారణాల వలన విడిపోయింది. ఇటీవల ఆమె ఓ బేబీ, యూట‌ర్న్‌, జాను, యశోద వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి మెప్పించింది.

తాజాగా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై.. కొంత భాగం షూటింగును పూర్తి చేసింది. ఈ చిత్రం షూటింగ్ 60 శాతం పూర్తయింది. సమంతా కోసమే ఈ చిత్ర షూటింగును ప్రస్తుతానికి ఆపేశారు. ఈ సినిమాతో పాటు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’లో కూడా సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది.

ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని.. మిగతా కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలను త్వరలోనే ఆమె డాక్టర్లు ఇచ్చిన ముందు జాగ్రత్తలతో పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆమె సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. మరికొందరేమో ఆమె శాశ్వతంగా సినిమాలు మానేయవచ్చు అంటున్నారు. గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం అందుకోసం చికిత్స చేయించుకుంటుంది. చికిత్స తర్వాత ఆమె తొందరగా కోలుకుంటుందని అభిమానులు భావించారు.

కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించిందనేలా మళ్లీ వార్తలు బయటికి వచ్చాయి. కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకోసమే ఆమె సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సి ఉంది.

Exit mobile version