విధాత, మెదక్ బ్యూరో: జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలి ముర్తుజా రిజ్వి తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వారి కంటి సమస్యలు తొలగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని అన్నారు. వచ్చే జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న రెండో విడత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్ ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో తయారు చేయాలని మంత్రి సూచించారు.
జిల్లాలో ఉన్న జనాభాకు అనుగుణంగా అవసరమైన వైద్య బృందాలను ఏర్పాటు చేసుకొవాలన్నారు. గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు మంత్రి తెలిపారు. బృందాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు గ్రామాల్లో, వార్డుల్లో శిబిరాలు ప్రారంభించాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, రీడింగ్ కళ్లద్దాలను జిల్లాలకు పంపుతామని తెలిపారు. జిల్లాలో ఆఫ్తామాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తి చేసి, జాబితా అందజేస్తే సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్.బీ ప్రసాద్ ల్యాబ్ లో శిక్షణ అందజేస్తామన్నారు.
వైద్య బృందాలకు అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం సైతం చేపట్టి , వారికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని మంత్రి సూచించారు. సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలగకుండా కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో నూతనంగా 959 డాక్టర్ల నియామకం వారంలో పూర్తవుతుందని, వీరికి అదనంగా ఆర్.బి.ఎస్.కె వైద్యులను, ఆయూష్ వైద్యులను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, గ్రామాల్లో, వార్డులో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్, మైక్రో ప్లానింగ్ పూర్తి చేసిన తరువాత, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని మంత్రి హరిష్ రావు ఆదేశించారు.
జిల్లాలో 5% అదనంగా కంటి వెలుగు బృందాలను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో కంటి వెలుగు శిబిరాల పనితీరు పర్యవేక్షించేందుకు (క్వాలిటీ కంట్రోల్)నాణ్యత ప్రమాణాల బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిబిరాలు నిర్వహించేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, అర్బన్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు గుర్తించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మందికి స్క్రీన్ చేయాలనే లక్ష్యం ఏర్పర్చుకు న్నామని, ప్రపంచంలో అతి పెద్ద కమ్యూనిటీ స్క్రినింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు సాధించాలని మంత్రి తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబులను అందిస్తామని తెలిపారు. జిల్లాలోని మండల, జిల్లా పురపాలక సంఘ మీటింగ్ లో కంటి వెలుగుపై చర్చించి ప్రజాప్రతినిధులకు సందేహ నివృత్తి చేయాలని, ఏ రోజు ఏ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు.
మేడ్చల్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో బృందంలో వైద్యాధికారి, ఆప్తోమేట్రిస్ట్, ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారన్నారు.
జిల్లాలో 5 మంది రెగ్యులర్ ఆప్తోమెట్రిస్ట్ లు ఉండగా ఇంకా 35 మంది ఆప్తోమెట్రిస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానించామని త్వరలో వారిని నియామకం చేస్తామని తెలిపారు. పి .హెచ్.సి. లలోని వైద్యాధికారులు, ఆయుష్ వైద్యులు, రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం వైద్యులు కలిపి మొత్తం 52 మంది వైద్యులున్నారని, అలాగే 270 మంది ఏ.యెన్.ఎంలు, 560 మంది ఆశా కారకర్తలు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, అయాజిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు, వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, డిప్యూటీ వైద్యాధికారి విజయనిర్మల, డాక్టార్ నవీన్, ఇంచార్జి డి.పి.ఓ. రాజేంద్ర ప్రసాద్, మునిసిపల్ కమిషనర్లు జానకిరామ్ సాగర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.