విధాత: మునుగోడు నియోజకవర్గం పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం పూర్తయిన తర్వాత కేటీఆర్ నేరుగా స్వామి ఇంటికి వెళ్లి.. వారి కుటుంబాన్ని సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్వామి ఇంట్లో కేటీఆర్ భోజనం చేశారు. అనంతరం స్వామితో పాటు అతని తల్లిదండ్రుల యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్, అంశాల స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో వ్యక్తిగతంగా కేటీఆర్ ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించిన కేటీఆర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ మిగతా పనులను పర్యవేక్షించారు.