విధాత: అక్టోబర్ 3వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తామని ముందుగానే హెచ్చరించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నేడురంగంలోకి దిగారు. పొద్దుగాల నుంచే రోడ్లు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ దగ్గర విధులు నిర్వహించారు.
ఆపరేషన్ రోప్ చేపట్టడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు జంటనగరాల పరిధిలో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. సిగ్నల్ జంప్స్, ట్రాఫిక్ లైన్ క్రాస్, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసే వాళ్లను నేరుగా పట్టుకొని జరిమానాలు విధించారు. అయితే ఇలాంటి తనిఖీల్లోనే పోలీసులకు ఊహించని సంఘటన అమీర్పేటలో ఎదురైంది.
రాంగ్రూట్లో వస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఆపి, తాళాలు లాక్కున్నందుకు ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడు. అమీర్పేట మైత్రివనం కూడలిలో జరిగిన ఈ ఘటనలో ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ తన బండిని కాల్చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పివేశారు.