- రాష్ట్రపతిని ఆహ్వానించే అంశంపై ప్రధాని, స్పీకర్ చర్చించుకోవాలి
- ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. పొరపాటును సరిదిద్దు కోవాలి
- వందేండ్లకోసారి ఇలాంటివి నిర్మిస్తారు.. ప్రారంభ ప్రకటన గౌరవప్రదంగా లేదు
- రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సూచన
విధాత: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించే అంశాన్ని ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్ల పరస్పరం చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) సూచించారు.
ఇప్పటికీ సమయం మించిపోలేదని, కేంద్రం చేసిన పొరపాటును సరిదిద్దు కోవచ్చని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనాల వంటివి వందేండ్లకోసారి నిర్మిస్తారని తెలిపారు. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తామంటూ హఠాత్తుగా చేసిన ప్రకటన గౌరవప్రదంగా లేదని పేర్కొన్నారు.
ఎందుకంత తొందర?
‘భవనం ప్రారంభోత్సవానికి ఎందుకు అంత తొందర? ప్రారంభోత్సవ ప్రకటనను కొన్ని నెలల ముందే చేయాల్సి ఉండే. అందరు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖులను పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి’ అని గెహ్లాట్ సూచించారు.
ప్రతిపక్ష పార్టీలు చేసిన సామూహిక బహిష్కరణ ప్రకటనకు మద్దతు ప్రకటించిన గెహ్లాట్.. కార్యక్రమానికి హాజరుకాలని కోరారు. ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.