విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: ప్రతి నెల సక్రమంగా ఆసరా పింఛన్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే ప్రతినెలా పింఛన్ మంజూరు చేయాలంటూ కోదాడ పట్టణానికి చెందిన బ్ధిదారులు పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలోని విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం ధర్ననిర్వహించారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ… ప్రతినెల సక్రమంగా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయారు. గడిచిన రెండు నెలల నుంచి పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇవ్వవలసిన పింఛన్లు నెల చివరి వరకు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. పనులు మానుకొని ప్రతిరోజు పింఛన్ కోసం పోస్ట్ ఆఫీస్ వద్దకు వస్తున్నామని వాపోయారు.
ఎక్కువ సమయం క్యూ లైన్ లో నిలబడడం వల్ల అనారోగ్య సమస్యలతో చాలామందిమి ఇబ్బందులు పడుతున్నామ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగితే పైనుండి రాలేదు మమ్మల్ని చేయమంటారంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
అంతేకాకుండా పింఛన్ ఇచ్చేటప్పుడు వృద్ధులకు, వితంతువులకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 ఇచ్చే సమయంలో పై 16 రూపాయలు కూడా ఇవ్వడం లేదని… ఇలా ఎందుకు తీసుకుంటున్నారని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదన్నారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పైగా పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ధర్నా విరమించారు.