Site icon vidhaatha

High Court | గిరిజ‌న మ‌హిళ‌పై పోలీసుల దాడి.. సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

High Court |

విధాత, హైద‌రాబాద్: గిరిజ‌న మ‌హిళ‌పై పోలీసులు దాడి చేసిన ఘ‌ట‌న‌ను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. ఆగస్టు 15న రాత్రి సమయంలో ఎల్బీనగర్ బస్టాప్ లో ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళను పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి, విచక్షరహితంగా కొట్టినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనపై సీరియస్ అయిన రాచకొండ సీపీ చౌహాన్.. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్ల ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ఓ గిరిజ‌న మ‌హిళ‌పై పోలీస్ అధికారులు దాడిచేయడం అమానుషం, ఆ ఘ‌ట‌న చాలా బాధాక‌ర‌మ‌ని, వెంట‌నే సంబంధిత అధికారుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి సూరేప‌ల్లి నంద.. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాశారు.

ఈ లేఖ‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అలోక్ అరాధే, న్యాయ‌మూర్తి వినోద్ కుమార్ ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. తెలంగాణ డీజీపీ, హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, రాచకొండ పోలీస్ కమిషనర్‌, ఎల్బీనగర్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి విచార‌ణ నివేదిక‌ను ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

Exit mobile version