న్యూజిలాండ్లో సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ను న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యాక్రమానికి మంత్రి కేటీఆర్ వీడియో సందేశం పంపారు. కేటీఆర్ న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్కు ధన్యవాదాలు తెలిపారు. “రాజన్న సిరిపట్టు” విస్తరణకు సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులను ప్రపంచ వేదికలపైనా ఆవిష్కరించడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను మంత్రి అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా.. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు ఇప్పుడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నారన్నారు. సిరిసిల్ల రాజన్న సిరిపట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.