Site icon vidhaatha

Revanth Reddy | జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ప్రైవేటు కంపెనీల్లోనూ అమలు చేస్తాం: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

విధాత: జనాభా ప్రాతిపదిక దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన సభలో ప్రకటించింది. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు అన్ని కాంట్రాక్ట్‌లలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయడంతోపాటు.. ప్రైవేట్‌ విద్యాసంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేట్‌ కంపెనీల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది.

ఈ మేరకు 12 అంశాలతో కూడి డిక్లరేషన్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ కార్యక్రమాన్నైనా ఈ గడ్డమీద నుంచే చేపట్టిందని, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే గడ్డపై ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు.

చేవెళ్ల గడ్డపై మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నానన్నారు. జనాభా ప్రాతిపదిక దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్‌, సోనియాలు నిర్ణయించారని, కేసీఆర్‌ అమలు చే యకుండా మోసం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
డిక్లరేషన్‌లోని అంశాలు ఇవే.

1. ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు. ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలుకు గట్టి చర్యలు
2. అంబేద్కర్‌ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం. వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించి, పూర్తిస్థాయిలో అమలు.
3. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌తోపాటు అన్ని కాంట్రాక్ట్‌లలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు. ప్రైవేట్‌ విద్యాసంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేట్‌ కంపెనీల్లోనూ అమలు.
4. ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షల ఆర్థిక సహాయం. ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు.
5. బీఆరెస్‌ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములను తిరిగి అసైనీలకు ఇచ్చి, అన్న హక్కులతో పునరుద్దరణ. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు ఆసైన్డ్‌ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తాం.
6. సోనియా, రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ తీసుకు వచ్చిన అటవీ హక్కుల చట్టం-2005ను పటిష్టంగా అమలు చేసి అర్హులైన అందరికి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తాం.
7. సమక్క, సారలమ్మ గిరిజన గ్రామీణాభివృద్ది పథకం కింద ప్రతి గూడెం, ప్రతి తండా పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం.
8. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు. మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్ల నిధుల మంజూరు.
9. ఎస్టీలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు. తుకారాం ఆదివాసీ, సంత్‌ సేవాలాల్‌ లంబాడా, ఎరుకల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతి ఏడాదీ ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధుల కేటాయింపు.
10. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్లగొంండ, మహబూబాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో 9 సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం.
11. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్‌ అయిన వారికి రూ.10 వేల నగదు, ఇంటర్‌ పాస్‌ అయిన వారికి రూ.15 వేలు, గ్రాడ్యుయేట్‌ పాస్‌ అయిన వారికి రూ.25 వేలు, పీజీ పాస్‌ అయిన వారికి రూ.లక్ష, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేసిన వారికి రూ.5 లక్షల నగదు.
12. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడంతోపాటు గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ హాస్టల్‌ సదుపాయం. విదేశీ యూనివర్సీటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం.

Exit mobile version