విధాత : దక్కనీ, కాకతీయ శైలిలో అన్ని హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకొంటున్న నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ మేరకు తెలంగాణ నూతన సచివాలయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొత్త సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరి కొద్ది నెలల్లోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మూడు గొప్ప కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపం, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ సెక్రటేరియట్ను కేసీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వర్క్స్టేషన్ ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. మూడు షిప్ట్లలో కలిపి దాదాపు 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి.