విధాత, మెదక్ బ్యూరో: వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ప్రగతిలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి గావించి ప్రారంభానికి సిద్ధం చేయలని అదనపు కలెక్టర్ రమేష్ పంచాయత్ రాజ్ ఈఈ సత్యా రెడ్డిని ఆదేశించారు. చివరి దశలో ఉన్న ఇండ్లను అన్ని మౌలిక వసతులతో వేగవంతంగా సిద్ధం చేసి లబ్దిదారులకు పంపిణి చేయుటకు వీలుగా సమన్వయం చేయుటకు జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని అన్నారు.
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రగతిని సోమవారం తన ఛాంబర్ లోఇరువురితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 5,254 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఇంతవరకు 3,665 ఇళ్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చి 2,344 ఇండ్లు పూర్తి గావించామని, మరో 1,061 ఇండ్ల ప్రగతి చివరి దశలో ఉన్నాయని అన్నారు.
జిల్లాలోని 10 మండలాలలో 1061 ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని అన్నారు. రామాయంపేట్ 304, చేగుంట, మెదక్లో 125, చేగుటలో 108 నిజాంపేట మండలంలో 152, పాపన్నపేట 104, ఎల్దుర్తి మండలంలో 149, మనోహరాబాద్ లో 72, నర్సాపూర్లో 30, మాసాయిపేటలో ఒకటి ఉన్నదని అన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జాబితా సిద్ధంగా ఉంచు కోవాలన్నారు. పనుల పురోగతిని ప్రతివారం సమీక్షిస్తానని రమేష్ తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఈ ఈ సత్యా రెడ్డి, హోసింగ్ ప్రత్యెకాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.