టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
విధాత: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై ఇవాళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసును హైకోర్టు (High Court) మూడు వారాలకు ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదనే వాదనకు పిటిషనర్ సరైన ఆధారాలు సమర్పించ లేదని హైకోర్టు పేర్కొన్నది. లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ రిపోర్ట్ సమర్పణకు ప్రభుత్వానికి హైకోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ ఇది అన్నారు. లీకేజీ కేసులో సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటివరకు ఈ కేసులో 9 మంది అరెస్టు చేశారు. పిటిషనర్లు కేవలం ఇద్దరే అరెస్టు అయ్యారని వాదించడం సరికాదన్నారు.
కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ వివేక్ ధన్కా (Vivek Dhanka) వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసుపై సమగ్ర విచారణ జరపాలని, ఇద్దరు నిందితులకే సంబంధం ఉన్నదని ఐటీ మంత్రి చెప్పారని, కేసు మొదటి దశలోనే ఇద్దరికే ప్రమేయం ఉన్నదని ఎలా చెబుతారని వివేక్ ప్రశ్నించారు. దర్యాప్తు విషయంలో ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఒకే మండలం నుంచి 20 మంది అధిక మార్కులు సాధించారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని ధన్కా హైకోర్టును కోరారు. విచారణ సందర్భంగా రేవంత్రెడ్డి, ఇతర నేతలు హైకోర్టుకు వచ్చారు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. అయితే లీకేజీ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఇందుకు ప్రభుత్వానికి కోర్టు మూడు వారాల గడువు విధించింది.
గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయి? రేవంత్
సిట్ ద్వారా టీఎస్పీఎస్సీ లీకేజీ గుట్టు బయటపడదని అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయి? భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోర్టును కోరాం. సిట్ విచారించిన విషయాలు మాకు కూడా ఇవ్వాలని కోరాం. పేపర్ లీకేజీ అంశంపై ప్రవీణ్, రాజశేఖర్కే పరిమితం కాదు. ఛైర్మన్, సెక్రటరీ, శంకరలక్ష్మిని బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లను ఆడిట్ చేయాలి. విచారణ సరిగా జరగాలని కోరితే నాకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
సిట్ నాలుగో రోజు దర్యాప్తులో కీలక ఆధారాల సేకరణ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్రెడ్డి నివాసం ఉంటున్న మణికొండలోని తన నివాసంలో ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగో రోజు దర్యాప్తులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరీక్ష రాసిన గోపాల్, నీలేష్కు సోదరుడు ఆర్థిక సాయం చేసినట్టు గుర్తించారు.
ప్రశ్నపత్రాల కొనుగోలుకు రాజేంద్ర నాయక్ డబ్బులు ఇచ్చినట్టు గుర్తించారు. మేడ్చల్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా కొంత డబ్బు ఇచ్చినట్టు సమాచారం. గోపాల్, నీలేష్ లు మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాశారు. ప్రశ్నపత్రానికి ఇద్దరు అభ్యర్థులు రూ. 14 లక్షలు సమకూర్చారు. బడంగ్పేట లోని ప్రవీణ్ ఇంట్లో సిట్ నిన్న సోదాలు జరిపింది.